పొంచిఉన్న ప్రమాదం..
- శిథిలావస్థలో నిజాం కాలం నాటి బ్రిడ్జి..
- సుల్తాన్ పూర్ - జమ్ షెడ్ బేగ్ పేట గ్రామాల మధ్య వంతెన..
- బిక్కుబిక్కుమంటూ ప్రయాణీకుల రాకపోకలు..
- హైలెవల్ వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల అలసత్వం ప్రయాణీకుల పాలిట శాపంగా మారుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం సుల్తాన్ పూర్ - జమ్ షెడ్ బేగ్ పేట గ్రామాల మధ్య ఉన్న వాగుపై రాకపోకలకు వీలుగా నిజాం నవాబు కాలంలో బ్రిడ్జి నిర్మాణం చేశారు. అయితే, రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి పిల్లర్ రాళ్ళు కూలిపోయాయి. అప్పుడు బ్రిడ్జిని సంబంధిత అధికారులు పరిశీలించి తాత్కాలిక మరమ్మత్తులు చేశారు. అప్పటి నుండి అదే బ్రిడ్జి గుండా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలను సాగిస్తున్నాయి. రేగొండ నుండి జగ్గయ్యపేట, సుల్తాన్ పూర్, కొత్తపల్లిగోరి, కొత్తపల్లి, అబ్బాపూర్, జాకారం, ములుగు తో పాటు చుట్టుపక్కల గ్రామాలైన వెంకటేశ్వర్లపల్లి, కోనరావు పేట, నిజాం పల్లి, కొప్పుల, గంగిరేని గూడెం మరియు మరికొన్ని గ్రామాల ప్రజలు ప్రయాణం చేస్తుంటారు. అయితే, ఈ బ్రిడ్జిపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ పనుల నిమిత్తం వెళ్తుంటారు. ఇటీవల ఈ బ్రిడ్జి మీదుగా ప్రయాణీకుల తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పెద్ద ప్రమాదం ఏమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు వెంటనే స్పందించి హైలెవల్ వంతెన నిర్మాణం చేపట్టాలని పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.

గుడ్ జాబ్
ReplyDeleteGreat job
ReplyDeletetq anna
ReplyDeleteసూపర్ అన్న గారు...
ReplyDelete