ఘోర రోడ్డు ప్రమాదం..
- కారు వాగులో పడి ఆరుగురు మృతి..
- గంగోత్రి జాతీయ రహదారిపై కోటిగడ్డ వద్ద ఘటన..
- మృతులంతా పశ్చిమ బెంగాల్ వాసులుగా గుర్తింపు..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
ఉత్తరాఖండ్ లోని తెహ్రి లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గంగోత్రి జాతీయ రహదారిపై ఈ సాయంత్రం కోటిగడ్డ సమీపంలో అదుపు తప్పి బొలెరో వాహనం హైవే పక్కనే ఉన్న వాగులో పడిపోయింది. వాహనం కాలువలో పడిన వెంటనే మంటలు చెలరేగాయి. వాహనం కాలువలో పడిపోవడాన్ని గమనించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెలరేగిన మంటలను నీళ్లు పోసి ఆర్పివేశారు. అయితే అప్పటికే కారులోని ఆరుగురు మృతి చెందారు. ప్రమాదంపై అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు స్థానికులు.
ఇట్టి ప్రమాదంపై స్ధానిక తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ.. వాహనంలో ఆరుగురు ఉన్నారని, వీరిలో ఐదుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు తెలిపారు. మంటల్లో మూడు మృతదేహాలు వాహనం లోపల ఉండగా, మూడు మృతదేహాలు వాహనం బయట పడి ఉన్నాయని చెప్పారు. వాహనంలో ఉన్న వారందరూ పశ్చిమ బెంగాల్కు చెందిన వారని చెప్పారు. వీరందరూ ఉత్తరకాశీలోని ఒక కొండపై ట్రెక్కింగ్ కోసం ఉత్తరకాశీ వెళ్తున్నారని, ఈ ఉదయం ఈ యువకులు రెండు వాహనాల్లో రైవాలా నుంచి ఉత్తరకాశీకి బయలుదేరారని చెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

No comments:
Post a Comment