ఢిల్లీ కకావికలం..
- దేశ రాజధాని లో వర్ష భీభత్సం..
- వరదల్లోనే రోడ్లు, కూలిన చెట్లు..
- ఎయిర్ పోర్ట్ లో స్కిడ్ అయిన జెట్ ఎయిర్ వేస్ విమానం..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
భయానక ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం దేశరాజధాని ఢిల్లీని చిగురుటాకులా వణికించింది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో అసాధారణ రీతిలో వర్షం కురుస్తున్నది. దీంతో, భారీ వృక్షాలు సైతం నేలమట్టమయ్యాయి. పటిష్టమైన గోడలను సైతం అటు ఇటు ఊపేస్తూ.. భయానక ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం దేశరాజధాని ఢిల్లీని చిగురుటాకులా వణికించింది.
గంటలపాటు కురిసిన వర్షానికి వరద ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో, సగానికిపైగా నగరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రమాదకర వాతావరణంలో ప్రయాణించలేక పలు విమాన సర్వీసులు రద్దు కావడంతో ఎయిర్ పోర్టులో జనం పడిగాపులు కాస్తున్నారు. తుపాను లాంటి వర్షం ఇంకొన్ని గంటలు కొనసాగనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది.
ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ పరిసర ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు,మెరుపులతో కూడిన గాలివాన కురుస్తోంది. సోమవారం ఢిల్లీ-ఎన్సీఆర్ పరిసర ప్రాంతాలలో గంటకు 50 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతోపాటు ఉరుములతో కూడిన తుపాన్ కొనసాగుతున్నది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షానికితోడు ఈదురుగాలులు బలంగా వీస్తుండటంతో ప్రజలు ఇల్లు వదిలి బయటికి రావొద్దని ఐఎండీ సూచించింది. గాలి బలంగా వీస్తుండటంతో ఇంటి కిటికీలు, తలుపులు మూసివేయాలని, ప్రయాణాలను నివారించాలని కూడా ఐఎండీ కోరింది.
వర్షం పడుతోన్న సమయంలో ప్రజలు చెట్ల కింద తలదాచుకోవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఐఎండీ సూచించింది. కాంక్రీట్ అంతస్తులపై పడుకోవద్దని, కాంక్రీట్ గోడలకు ఆనుకొని ఉండవద్దని, ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అన్ప్లగ్ చేయాలని ఐఎండీ తెలిపింది. గాలివాన వల్ల కచ్చాఇళ్లు, గోడలు, గుడిసెలు పడిపోతాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. భారీవర్షాల వల్ల ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.


No comments:
Post a Comment