ఉస్మానియా ఆస్పత్రిలో దారుణం..
పైసలిస్తేనే డెడ్ బాడీ ఫ్రీజర్ లోకి..
వెంకటేశ్వర్లపల్లి, తెలంగాణ:
హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో ఈరోజు దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.1000 ఇస్తేనే మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్సులో భద్ర పరుస్తామని మార్చురీ సిబ్బంది మృతుడి బంధువులను డిమాండ్ చేశారు. బాధితులు ఈ విషయాన్ని తమ సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించడంతో వైరల్గా మారింది. మలక్పేటకు చెందిన మహ్మద్ ముజీబ్ అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న చాదర్ఘాట్ పోలీసులు కుటుంబీకులతో కలిసి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
అయితే, అక్కడ మార్చురీ వద్ద మద్యం మత్తులో విధుల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగి రాజు మృతదేహాన్ని భద్ర పరచాలంటే రూ.1000 ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని కుటుంబ సభ్యులు ఎదురు తిరగడంతో ఇరువురి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న రాజు పోలీసులను సైతం తోసివేస్తూ మార్చురీ గదిని మూసివేస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. మృతుడి కుటుంబీకులు అతడిపై ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సూపరింటెండెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగిపై ప్రాథమిక విచారణ చేపట్టిన అనంతరం అతడిని విధుల్లోంచి తొలగించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బి.నాగేందర్ మాట్లాడుతూ.. ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లు, వార్డులు సెక్యూరిటీ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, మార్చురీ, రోగ నిర్ధారణ కేంద్రాల్లోని సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉస్మానియా ఆసుపత్రి ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేదేలేదన్నారు.

No comments:
Post a Comment