పల్లెల్లో అమృత్ సరోవర్ సాగదీత..
- ఆగష్టు 15 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం..
- ఒక్కో చెరువుకు లక్ష నుండి 30 లక్షల వరకు ఫండ్..
- పలు గ్రామాల్లో అధికారుల చేతివాటం..
- పని చేయని వారికి సైతం మస్టర్లలో హాజరు..
తెలంగాణ:
నీటి సంరక్షణ, నీటి వనరుల అభివృద్ధి, పునరుద్ధరణ కొరకు అమృత్ సరోవర్ పథకం ప్రారంభమైన విషయం తెలిసిందే. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా అమృత్ మహోత్సవ్లో భాగంగా పలు గ్రామాల్లో చెరువుల పునరుద్ధరణ, చెరువుల నిర్మాణం మిషన్ అమృత్ సరోవర్ పథకం కింద చేపట్టారు. ఈ పథకంలో భాగంగా ఎంపిక చేసిన పనులను ఆగస్టు 15వ తేదీకల్లా పూర్తి చేసి ఆ ప్రాంతాల్లో జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం అధికారులకు లక్ష్యం నిర్దేశించింది. అయితే, ఆగష్టు నెల ప్రారంభమైనా ఈ పథకం పనులు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలో చెరువులను అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే పనులు జరుగుతున్న తీరు చూస్తే ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి పూర్తయ్యే పరిస్థితులు కానరావడం లేదు. ఈ పథకం కింద చెరువులను గుర్తించగా కొన్ని చెరువుల్లో పనులు జరుగుతున్నాయి. భూపాలపల్లి జిల్లాలో ఒక్కొక్క చెరువు అభివృద్ధికి రూ.లక్ష నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అంతేగాక, చెరువుల అభివృద్ధికి, నిధుల సేకరణకు దాతల సహకారం కూడా తీసుకోవచ్చు. ఒక ఎకరం పైబడిన చెరువులను మాత్రమే అభివృద్ధి చేయాలని నిబంధన విధించింది. ఈ చెరువుల అభివృద్ధి పనులకు ఉపాధి హామీ పథకంతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులను వెచ్చించే అవకాశాన్ని కేంద్రం కల్పించినా కొంత మంది అధికారులు తాత్సారం చేస్తున్నారు. చెరువు అడుగున 10 వేల ఘనపుటడుగుల మేర నీరు నిల్వ ఉండేలా పనులు చేపట్టాలి. చెరువు స్థలాల్లో ఉన్న ఆక్రమణలు తొలగించాలి. ఈ పథకంలో చెరువుల అభివృద్ధి వల్ల తాగు, సాగుకు నీటి వనరులు పుష్కలంగా ఏర్పడతాయి. ఈ వనరులను వినియోగించుకుంటే సాగు, తాగునీటి ఇబ్బందులు తీరుతాయి.
ఇదిలావుంటే, కొన్ని గ్రామాల్లో అమృత్ సరోవర్ పథకం కింద చెరువులను తవ్వుతున్నారు ఉపాధి కూలీలు. అయితే, అందులో పెద్ద సంఖ్యలో బినామీ పేర్లు వస్తున్నాయని ఆరోపణలు చేస్తున్నారు పలువురు. పనిచేయని వారికి సంబంధిత మస్టర్లలో ఇంచార్జీ ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, టీ ఏ ల ప్రమేయంతో హాజరు వేస్తున్నట్లు పలువురు కూలీలు వాపోతున్నారు. కొలతల ప్రకారం పని చేసిన వారికి టెక్నికల్ అసిస్టెంట్ లు తక్కువ పేమెంట్స్ చేస్తున్నారని, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పని ప్రదేశానికి రావడం లేదని కూలీలు చెబుతున్నారు. ఇప్పటికైనా, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని పలు గ్రామాల కూలీలు కోరుతున్నారు.

No comments:
Post a Comment