కామన్వెల్త్ లో సత్తా చాటిన నిఖత్ జరిన్..
తెలంగాణ:
ఇంగ్లాండ్ బర్మింగ్హామ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ 2022 ఈవెంట్స్ రసవత్తరంగా సాగుతోన్నాయి. భారత్ చివరి రోజుకు ఒక రోజు ముందు పతకాల పంట పండిస్తోంది. దాదాపుగా అన్ని ఈవెంట్లల్లోనూ పతకాలను కొల్లగొట్టేస్తోంది. బాక్సింగ్లో టీమిండియాకు ఎదురే ఉండట్లేదు. ఇప్పటికే నీతు ఘంఘాస్, అమిత్ పంఘాల్ స్వర్ణాలు సాధించి బాక్సింగ్లో సత్తాచాటగా.. తాజాగా, మరో బాక్సర్, తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ సైతం గోల్డ్ మెడల్ సాధించింది. తద్వారా ఇండియా గోల్డ్ మెడళ్ల సంఖ్య 17కు చేరుకుంది. న్యూజిలాండ్ను పతకాల పట్టికలో వెనక్కి నెట్టిన ఇండియా 4వ స్థానానికి చేరుకుంది.
వుమెన్స్ 50కేజీల ఫ్లైవెయిట్ కేటగిరి ఫైనల్లో నిఖత్ జరీన్ తన ప్రత్యర్ధి అయిన నార్తెర్న్ ఐర్లాండ్కు కారిల్ మెక్ నౌల్ను చిత్తు చేసి గెలుపొందింది. బౌట్లో నిఖత్ ధాటికి ఏమాత్రం మెక్ నౌల్ నిలవలేకపోయింది. ఇక అంపైర్లు ఏకగ్రీవంగా నిఖత్ జరీన్ను విజేతగా ప్రకటించారు. ఇటీవలే ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలిచిన నిఖత్ జరీన్ తాజాగా కామన్ వెల్త్ గేమ్స్లో కూడా గోల్డ్ అందించింది. ఇక తొలి రౌండ్ నుంచే నిఖత్ అధిపత్యం కొనసాగింది. తొలి రౌండ్లో 5-0తో ఏకగ్రీవంగా గెలిచిన నిఖత్ రెండో రౌండ్లోనూ అదే రీతిలో ఆడి గెలుపొందింది. తద్వారా చివరి రౌండ్లోనూ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడి విజేతగా ఆవిర్భవించింది.
నిఖత్ జరీన్ తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన బాక్సర్. ఆమె తల్లిదండ్రులు ఎండీ. జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానా. 1996 జూన్ 14న జన్మించిన ఈ మేటి బాక్సర్.. తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని నిజామాబాద్లోని నిర్మల హృదయ బాలికల ఉన్నత పాఠశాలలో పూర్తి చేసింది. ఆమె హైదరాబాద్లోని ఏవీ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో డిగ్రీ చదివింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన హైదరాబాద్లోని ఏసీ గార్డ్స్ జోనల్ కార్యాలయంలో స్టాఫ్ ఆఫీసర్గా జరీనా నియమితులైంది.

No comments:
Post a Comment