శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..
- హైదరాబాద్ టూ తిరుపతి యాత్ర..
- ప్యాకేజీని ప్రకటించిన తెలంగాణ టూరిజం శాఖ..
- ధర కేవలం రూ.4 వేల కంటే తక్కువే..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
మీరు మీ కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్దామనుకుంటున్నారా? అయితే, తెలంగాణ టూరిజం శాఖ యాత్ర ప్యాకేజీని ఈరోజే వెల్లడించింది. ఈ ప్యాకేజీ ధర కేవలం రూ.4వేల లోపే ఉంది.
కరోనా మహమ్మారి ప్రభావం దాదాపుగా తగ్గిపోవడంతో రెండేళ్లుగా టూర్లను వాయిదా వేసుకున్నవారంతా కూడా ఇప్పుడు మళ్లీ బ్యాగులు సిద్ధం చేసుకుంటున్నారు. వేసవి సెలవులు ఉండటంతో టూర్లకు బయల్దేరుతున్నారు. తిరుమల లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలకు కూడా భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. పర్యాటకుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని టూరిజం సంస్థలు పలు టూర్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. తెలంగాణ టూరిజం శాఖ కూడా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. అందులో భాగంగా తిరుమల తిరుపతి టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ వివరాలను తెలంగాణ టూరిజం కు సంబంధించిన వెబ్ సైట్ లో చూడొచ్చు. ఇది రెండు రాత్రులు, ఒక రోజు టూర్ ప్యాకేజీ. మొదటి రోజు టూర్ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లో ప్రారంభమై, సాయంత్రం 5 గంటలకు కేపీహెచ్బీలో, సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్లోని యాత్రీ నివాస్లో, సాయంత్రం 6.15 గంటలకు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో, సాయంత్రం 7 గంటలకు బషీర్బాగ్లోని సీఆర్ఓ ఆఫీసు దగ్గర ఈ టూరిజం బస్సులో రావచ్చు.
పర్యాటకులు మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరుపతి చేరుకుంటారు. అక్కడ హోటల్లో వసతి సౌకర్యాలు కల్పిస్తుంది. పర్యాటకులు రెడీ అయిన తర్వాత తిరుమలకు బయల్దేరాల్సి ఉంటుంది.. తిరుమలలో సుమారు మధ్యాహ్నం ఒంటి గంటకు దర్శనం ఉంటుంది. దర్శనం పూర్తైన తర్వాత సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం ఉంటుంది. మరుసటి రోజు ఉదయం తిరుపతికి చేరుకోవడంతో టూర్ పూర్తవుతుంది.
తెలంగాణ టూరిజం అందించే తిరుమల తిరుపతి టూర్ ప్యాకేజీ ధర పెద్ద వారికైతే రూ.3,600, పిల్లలకైతే రూ.2,880. ఒక రోజులో తిరుపతి వెళ్లి తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి ఈ టూర్ ప్యాకేజీ. ఈ ప్యాకేజీలో బస్సులో ప్రయాణం, హోటల్లో వసతి, తిరుమలలో దర్శనం మాత్రమే కవర్ అవుతాయి. ఇతర ఆలయాల సందర్శన కవర్ కావు. తెలంగాణ టూరిజం బస్సులోనే ప్రయాణించాల్సి ఉంటుంది. సొంత ప్రయాణ ఏర్పాట్లు చేసుకొని ప్యాకేజీ టికెట్తో టీటీడీ దగ్గర రిపోర్ట్ చేయడం కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బులు తిరిగి చెల్లించడం కుదరదని టూరిజం శాఖ స్పష్టం చేసింది.


No comments:
Post a Comment