నూతన గ్రామ పంచాయతీలకు సొంత భననాలు..!
తెలంగాణ:
తెలంగాణలో పరిపాలనా సౌలభ్యం సంస్కరణలలో భాగంగా ఏర్పాటైన కొత్త గ్రామ పంచాయతీలన్నింటికీ, గతంలో సీఎం అసెంబ్లీలో ఇచ్చిన హామీ, కేటాయించిన నిధులతో వారి ఆదేశాల మేరకు త్వరలోనే కొత్త భవనాలను దశల వారీగా నిర్మిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ లు తెలిపారు.
అలాగే, భవనాలు లేని పాత గ్రామ పంచాయతీల్లోనూ కొత్త భవనాలు నిర్మిస్తామన్నారు. కొత్తగా గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డ లంబాడా తండాలు, ఏజెన్సీ గూడాల్లోనూ త్వరలోనే కొత్త భవనాలను నిర్మిస్తామన్నారు. ఈ విషయమై నిధులు, విధి విధానాలు, ప్రణాళికలు వంటి పలు అంశాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి మినిస్టర్స్ క్వార్టర్స్ లోని తన నివాసంలో ఈరోజు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు మాట్లాడుతూ..
రాష్ట్రంలో 12వేల 769 గ్రామ పంచాయతీలు ఉన్నాయని,
అందులో గ్రామ పంచాయతీ భవనాలు లేని తండాలు 1,0 97 ఉండగా, ఏజెన్సీ ప్రాంతాల్లో 688 ఉన్నాయని చెప్పారు. అలాగే, 2,960 మైదాన ప్రాంత గ్రామ పంచాయతీల్లో భనవాలు లేవన్నారు. మొత్తం 4,745 గ్రామ పంచాయతీలకు కొత్త భవనాల అవసరం ఉందన్నారు. అయితే, వీటిలో ఇప్పటికే సంబంధిత ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల నుండి అందిన ప్రతిపాదనలు, ఇంకా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల నుంచి అందాల్సిన ప్రతిపాదనలను బట్టి దశల వారీగా తండాలకు, ఏజెన్సీ ఆవాసాలకు, ఇతర గ్రామాలకు
ప్రాధాన్యతా క్రమంలో కొత్త గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేసి, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో వేగంగా నిర్మిస్తామన్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో కొత్త భవనాల పనులు ప్రగతిలో ఉన్నాయని, ఇంకా మిగతా అన్ని కొత్త భవనాలను కొత్త గ్రామ పంచాయతీ భవనాలను నిర్మిస్తామన్నారు.